‘కోహ్లి.. కొంచెం రాహుల్‌ను పట్టించుకో’ | Sakshi
Sakshi News home page

Published Mon, Dec 24 2018 3:58 PM

Virat Kohli Trolled For Lauding Anushka Sharma's Performance In Zero  - Sakshi

ముంబై: టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లి నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యాడు. తన సతీమణి, బాలీవుడ్‌ నటి అనుష్క శర్మ తాజా చిత్రం ‘జీరో’ను కోహ్లి కొనియాడటంపై అభిమానులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సినిమాలకు రివ్యూలివ్వడం ఆపి ఆటగాళ్ల ఆటతీరును సమీక్షించుకోవాలని చురకలంటిస్తున్నారు. అనుష్క నటించిన 'జీరో' చిత్రం శుక్రవారం విడుదలైన విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని చూసిన కోహ్లి ట్విటర్‌ వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు.

‘'జీరో' చిత్రాన్ని చూశాను. ఎంతో వినోదాత్మకంగా ఉంది. నేను బాగా ఎంజాయ్‌ చేశాను. ఈ చిత్రంలో ఎవరి పాత్రలకు వారు బాగా న్యాయం చేశారు. నాకు అనుష్క శర్మ నటన బాగా నచ్చింది. ఆమెది ఇందులో ఛాలెంజ్‌తో కూడుకున్న పాత్ర అనిపించింది. ఇందులో తను అత్యద్భుతంగా నటించింది’ అని కొనియాడుతూ ట్వీట్‌లో పేర్కొన్నాడు. ఈ ట్వీట్‌తో చిర్రుత్తుకుపోయిన అభిమానులు కోహ్లిపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.

నీ భార్య సినిమా కన్నా ఆ కేజీఎఫ్‌ చాలా నయం అని ఒకరంటే.. ఈ సినిమా లొల్లి ఎందుకు కానీ ఆ కేఎల్‌ రాహుల్‌ను కొంచెం పట్టించుకో.. లేకుంటే డిసెంబర్‌ 26న మరో జీరోనే అని మరొకరు కామెంట్‌ చేశారు. రెండో టెస్ట్‌ అనంతరం అనుష్క భారత ఆటగాళ్ల ప్రదర్శనను కొనియాడిందా? మరి ఈ చెత్త సినిమా విషయంలో ఆమెను ఎందుకు పొగుడ్తున్నావ్‌? అని ఇంకొకరు మండిపడ్డారు. ప్రస్తుతం కోహ్లిసేన ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. తొలి టెస్ట్‌ నెగ్గిన భారత్‌.. రెండో టెస్ట్‌లో ఘోరపరాజయం చవిచూసింది. దీంతో డిసెంబర్‌ 26 నుంచి ప్రారంభమయ్యే మూడో టెస్ట్‌ నెగ్గి సిరీస్‌లో పై చేయి సాధించాలని ఉవ్విళ్లూరుతోంది. అయితే తొలి రెండు టెస్ట్‌ల్లో దారుణంగా విఫలమైన కేఎల్‌ రాహుల్‌పై అభిమానులు ఆగ్రహంగా ఉన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement